అన్ని స్కూళ్లలో ఈత కొలనులు: మంత్రి వాకిటి
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:21 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈత కొలనులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
శంషాబాద్ రూరల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈత కొలనులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని జీఎంఆర్ ఏరినాలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శనివారం ఆయన రన్నింగ్ ట్రాక్, స్విమ్మింగ్పూల్, మినీ ఫుట్బాల్ కోర్టులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఈత రాక రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్ని పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుపై చర్చిస్తానని చెప్పారు. పాఠశాల దశ నుంచే ఈత నేర్చుకుంటే ఇబ్బంది ఉండదన్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఇక నాణ్యమైన విద్యను అందించడమే తమ జీవిత లక్ష్యమని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ కొమురయ్య అన్నారు.