Minister Uttam Kumar Reddy: నెలాఖరులోగా ఎస్ఎల్బీసీ పనులు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:24 AM
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులను నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు
డీబీఎం విధానంలో పునఃప్రారంభం కావాలి:ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులను నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. నిర్మాణ సంస్థకు వారం రోజుల్లోగా కొంతమేర బిల్లుల చెల్లిస్తామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. రెండువైపులా టన్నెల్ బోరింగ్ మెషీన్లు తీసివేసినందున... తక్షణమే డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మోడల్) విధానంలో పనులను పునఃప్రారంభించాలని ఆదేశించారు. అయితే, పెండింగ్ బిల్లులు ఇస్తే తప్ప పనులను ప్రారంభించలేమని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ప్రతినిధి తేల్చి చెప్పటంతో వారం రోజుల్లోగా కొంతమొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వెనువెంటనే ఎస్ర్కో అకౌంట్ తెరవాలని నిర్మాణ సంస్థను మంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య జాబితాలో చేర్చిందని తెలిపారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి, గ్రావిటీతో రైతులకు నీటిని అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. డీబీఎం విధానంలో టన్నెల్ పనులు చేపట్టాలని సూచించారు.