గ్రామాల్లో మౌలిక మార్పులు తేవాలి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:09 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యక్రమం అమలులో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగుదల, ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు, గ్రామాభివృద్ధి వేగవంతం....
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యక్రమం అమలులో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగుదల, ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు, గ్రామాభివృద్ధి వేగవంతం, పెండింగ్ పన్నుల వసూళ్లు ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకోవాలని అధికారులకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క సూచించారు. 99 రోజుల కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలు, డీఆర్డీఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. గ్రామ శుభ్రత, పన్నుల వసూళ్ల డ్రైవ్, తాగునీటి వనరుల పరిశీలన, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల మరమ్మతులు, చెత్త నిర్వహణ చర్యలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యకర వాతావరణ కల్పనే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్న మంత్రి సీతక్క.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామాల్లో మౌలికమైన మార్పులు తేవాలన్నారు. ప్రతివారం చేపట్టిన పనులు, సాధించిన పురోగతిపై నివేదికలివ్వాలని ఆదేశించారు. బాల్య వివాహాల నివారణపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని, గ్రామసభల్లో తీర్మానాలు చేయించాలన్నారు.