ఆర్టీసీ కార్మికులకు వసతులను 17 లోగా మెరుగుపర్చాలి
ABN , Publish Date - May 03 , 2026 | 05:25 AM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ డిపోలు, బస్స్టేషన్లలో ఆర్టీసీ కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ప్రతి నెల రెండో మంగళవారం గ్రీవెన్స్ సెల్: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్/హుస్నాబాద్, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ డిపోలు, బస్స్టేషన్లలో ఆర్టీసీ కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీలోగా సదుపాయాలు మెరుగుపడాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఇకపై ప్రతి నెలా రెండో మంగళవారం డిపోలు, బస్ స్టేషన్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో శనివారం ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ.. డ్రైవర్, కండక్టర్లు, క్షేత్రస్థాయిలో సిబ్బందిని వేధించకుండా సానుకూల దృక్పధంతో అధికారులు పనులు చేయించాలన్నారు. నష్టాల్లో ఉన్న డిపోల ఆర్ఎంలు, డిపో మేనేజర్లతో సమీక్షించి పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టికెట్ల జారీలో అక్రమాలు జగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో ప్రత్యేకంగా కేటాయించిన వేదికలపై ప్రమాదానికి గురైన వాహనాలను హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాహనదారులకు యాక్సిడెంట్ స్పాట్ల గురించి తెలియజేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.