బీసీలంటే కోమటిరెడ్డికి ఎందుకంత చులకన?
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:50 AM
బీసీలంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఎందుకంత చులకన అని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు.
ఆ వ్యాఖ్యలు మహేశ్గౌడ్ నాయకత్వాన్ని కించపరచడమే: ఈరవత్రి అనిల్
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): బీసీలంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఎందుకంత చులకన అని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు. జగ్గారెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిస్తే వందసీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడమేనని విమర్శించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక బీసీ నేతను పక్కనపెట్టి, మరొకరికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం ద్వారా పార్టీలో చీలికలు తేవాలని ఆయన చూస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో, మహేశ్గౌడ్ పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేస్తోందన్నారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేతకు ఆ పదవి రాకుండా అడ్డుకునేందుకు చూసిన కోమటిరెడ్డి.. రాష్ట్రస్థాయిలో మహేశ్గౌడ్కు ఉన్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారని విమర్శించారు. బీసీ నేతలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలన్నారు.