ఉపాధి హామీ సిబ్బందికి తీపి కబురు
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:29 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 3,700మంది సిబ్బందికి రూ.కోటి వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది.
రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తింపు
వేతన బకాయిల కింద రూ.78కోట్లు విడుదల
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 3,700మంది సిబ్బందికి రూ.కోటి వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ పథకం కింద ఎస్బీఐ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఉద్యోగి జీతం ఆధారంగా రూ.40లక్షల నుంచి రూ.కోటి వరకు ఈ బీమా వర్తింపచేయనున్నారు. ప్రమాద బీమా కోసం అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రాష్ట్రంలోని 11,760 మంది ఉపాది హామీ సిబ్బంది జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కూలీల వేతన బకాయిలను చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 10నుంచి మార్చి 31వరకు ఉన్న రూ.383కోట్ల వేతన బకాయిలను చెల్లించేందుకుగాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వారం రోజుల్లోగా కూలీల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 ఏళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ్సగా(ఎఫ్టీఈ)లుగా గుర్తించాలని, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్యకు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.