డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలపై విచారణ!
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:24 AM
మెయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఫోకస్ పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి...
నిందితులను 8 గంటలు ప్రశ్నించిన సిట్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ శంషాబాద్ రూరల్)
మెయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఫోకస్ పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను మరోసారి సిట్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. రెండో విడత విచారణలో తొలి రోజు బుధవారం డ్రగ్స్ మూలాలపై ప్రశ్నించిన అధికారులు.. గురువారం ఆర్థిక లావాదేవీలపై దాదాపు 8 గంటలపాటు విచారించినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న నిందితులతో పాటు స్టేషన్ బెయిల్ మీద ఉన్న వారిని వేర్వేరుగా ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. ప్రధాన నిందితులు విచారణలో ఆర్థిక వ్యవహారాలపై సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో.. ఆధారాలు చూపుతూ వారిని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే గడిచిన ఐదేళ్లలో ఎన్ని డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు? వీటికి ఎవరైనా రాజకీయ నేతలు, ప్రముఖులు హాజరయ్యారా? వంటి అంశాలపై రోహిత్రెడ్డి, ఆయన సోదరుడు రితీష్లను పదేపదే ప్రశ్నించినట్లు తెలిసింది. మెయినాబాద్ ఫామ్హౌస్ తోపాటు నగరంలోని మరికొన్ని చోట్ల జరిగిన డ్రగ్స్ పార్టీలకు సంబంధించిన కొన్ని ఆధారాలను వారి ముందు పెట్టి అడిగినట్లు సమాచారం.