Share News

మేడారంలో పిల్లలు తప్పిపోతే ఇట్టే కనిపెట్టొచ్చు!

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:08 AM

మేడారం మహా జాతర.. ఆ రద్దీలో పిల్లలు తప్పిపోతే? తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, వివరాలు చెప్పే పరిణతి కూడా చిన్నారులకు లేకపోతే..

మేడారంలో పిల్లలు తప్పిపోతే ఇట్టే కనిపెట్టొచ్చు!

  • జాతరలో చిన్నారుల భద్రత కోసం క్యూఆర్‌ కోడ్‌ రిస్ట్‌బ్యాండ్లు

  • అందుబాటులోకి ‘చిల్డ్రన్‌ ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం’

  • జాతరలో 11 పాయింట్ల వద్ద చిన్నారుల వివరాలు నమోదు

  • తప్పిపోతే రిస్ట్‌బ్యాండ్‌ స్కాన్‌ చేసి కన్నవారి చెంతకు చేర్చనున్న వలంటీర్లు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతర.. ఆ రద్దీలో పిల్లలు తప్పిపోతే? తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, వివరాలు చెప్పే పరిణతి కూడా చిన్నారులకు లేకపోతే? ఆచూకీ రాబట్టడం ఎంత కష్టం? తల్లిదండ్రులకు ఈ టెన్షన్లేవీ లేకుండా జాతరలో పిల్లల భద్రత కోసం ‘చిల్డ్రన్‌ ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం (సీటీఎం్‌స)’ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ సాంకేతిక విధానం ప్రకారం జాతరకొచ్చే భక్తుల వెంట ఉన్న చిన్నారుల వివరాలను నిర్దేశించిన 11 ప్రత్యేక పాయింట్ల వద్ద సిబ్బంది నమోదు చేసుకుంటారు. ఆ వివరాల్లో చిన్నారులు, తల్లిదండ్రులు లేదా సంరక్షుల పేర్లు, ఫోన్‌ నంబర్లు కంప్యూటర్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రిస్ట్‌బ్యాండ్లను చిన్నారులకు చుడతారు. ఒకవేళ జాతరలో పిల్లలు తప్పిపోయి వలంటీర్లు, పోలీసుల కంటపడితే వారు.. చిన్నారుల చేతికి ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను తమ ఫోన్‌తో స్కాన్‌ చేస్తారు. ఆ వెంటనే తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్లు కనిపిస్తాయి. ఆ సమాచారంతో వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి పిల్లలను వారి చెంతకు చేరుస్తారు. ఈ మేరకు జాతర కోసం తొలిదశలో 25వేల రిస్ట్‌బ్యాండ్లు సిద్ధంగా ఉంచారు. వోడాఫోన్‌ ఐడియా సహకారంతో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐజీ సుమతి నెలన్నర పాటు శ్రమించి ఈ క్యూఆర్‌ కోడ్‌ను రూపొదించారు. శనివారం తన కార్యాలయంలో డీజీపీ శివధర్‌ రెడ్డి.. సీటీఎంఎస్‌ రిస్ట్‌బ్యాండ్లను, పోస్టర్లను ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఆయనే వెల్లడించారు. మహిళా భద్రతా విభాగం డీజీపీ చారుసిన్హా ఆధ్వర్యంలో మేడారం జాతరలో పూర్తి స్ధాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. భవిష్యత్తులో జరిగే కుంభమేళాలో ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌, చారుసిన్హా, డీఎస్‌ చౌహన్‌, ఐజీలు చంద్రశేఖర్‌ రెడ్డి, సుమతి, డాక్టర్‌ గజారావు భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:08 AM