తల్లుల ‘బంగారం’ పొందేదెట్టా..!
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:21 AM
మేడారం మహా జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ భక్తులు కొందరు ఆర్టీసీ కార్గో ద్వారా బంగారం(ప్రసాదం) బుక్ చేసుకోలేకపోతున్నారు.
ఆర్టీసీ కార్గో ఆన్లైన్ బుకింగ్లో సాంకేతిక లోపం
కొన్ని పిన్కోడ్ నంబర్లతో బుకింగ్ కాని వైనం
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ భక్తులు కొందరు ఆర్టీసీ కార్గో ద్వారా బంగారం(ప్రసాదం) బుక్ చేసుకోలేకపోతున్నారు. ఇందుకు సాంకేతిక సమస్యలు అవరోధంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఆర్టీసీ కార్గోతో నేరుగా ఇంటికే ప్రసాదం పంపిణీ చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు ప్రారంభించింది. అయితే ప్రసాదం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు కొన్ని ప్రాంతాల పిన్కోడ్ నంబర్లు నమోదు చేస్తే ఇన్వ్యాలిడ్ అని చూపుతోంది. దీంతో తల్లుల బంగారం పొందలేకపోతున్నామని ఆయా భక్తులు నిరాశచెందుతున్నారు. ఈనెల 15న ప్రారంభమైన ఈ సేవలు ఫిబ్రవరి 5 వరకు అందుబాటులో ఉంటాయి. రూ.299 చెల్లించి పేరు, పూర్తి చిరునామా నమోదు చేస్తే భక్తుల ఇంటికే అమ్మవారి చిత్రపటం, బంగారం పార్సిల్ పంపుతారు. ఇందుకోసం ఆన్లైన్లో లేదా ఆర్టీసీ కార్గో సెంటర్లకు వెళ్లి బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. మొదటి వారంలో 500 మందికిపైగా నమోదు చేసుకున్నారు.