పెళ్లై పిల్లలున్నా.. మహిళా కానిస్టేబుల్తో ప్రేమ
ABN , Publish Date - May 14 , 2026 | 04:01 AM
పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ ఎస్సై అదే శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్లో...
పెళ్లి పేరుతో మోసం
కొల్లూరు ఎస్సైపై లైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
విధుల నుంచి సస్పెన్షన్, రిమాండ్కు తరలింపు
మూసాపేట్, మే 13 (ఆంధ్రజ్యోతి): పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ ఎస్సై అదే శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2018 బ్యాచ్కు చెందిన ఎస్సై సురేశ్ కుమార్ ప్రస్తుతం కొల్లూర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి పెళ్లి అయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించే సమయంలో అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి సురేశ్కు మరింత దగ్గరైంది. అనంతరం ఎస్సై సురేశ్ కొల్లూరు స్టేషన్కు బదిలీ అయ్యాడు. పెళ్లి విషయంలో ఇద్దరిమధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా కానిస్టేబుల్ తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. కులం పేరుతో దూషించిన సురేశ్ చివరకు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో అతడు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు నెల రోజుల క్రితం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్ 69, 352తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని సెక్షన్3(2)(వీ), 3(1)(ఆర్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ ఏసీపీ నరేశ్రెడ్డి తెలిపారు.