మావోయిస్టులు జనజీవన స్రవంతిలో..కలిసేందుకు ప్రభుత్వాలు సహకరించాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:39 AM
కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్-2 నిలిపివేసి.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు...
గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలి
సీపీఐ రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్ర జ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్-2 నిలిపివేసి.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని.. మావోయిస్టులు ప్రజా క్షేత్రంలోకి రావాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. లొంగిపోతున్న మావోయిస్టులకు గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పరిస్థితులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో సాయుధ పోరాటం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేస్తున్న మావోయిస్టులది కూడా రాజకీయ పార్టీనే అని, వారిపట్ల కేంద్రం విద్వేషంతో వ్యవహరించడం తగదన్నారు.