సోదరా.. లొంగిపోండి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:40 AM
పార్టీలోని ముఖ్యనేతలు అందరూ లొంగిపోతున్నారు సోదరా.. మీరు కూడా లొంగిపోవాలి’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాల గణపతి అలియాస్ లక్ష్మణ్ ....
మావోయిస్టు అగ్రనేత ముప్పాల గణపతి సోదరుడు రాంచందర్ రావు
బీర్పూర్/చర్ల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘పార్టీలోని ముఖ్యనేతలు అందరూ లొంగిపోతున్నారు సోదరా.. మీరు కూడా లొంగిపోవాలి’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాల గణపతి అలియాస్ లక్ష్మణ్ రావును ఆయన సోదరుడు ముప్పాల రాంచందర్ రావు కోరారు. బుధవారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరు ఆరోగ్యంగా ఉండాలని గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మీరు నేపాల్లో ఉన్నారని, ఆరోగ్యం బాగాలేదని వార్తల్లో వింటున్నాం. పార్టీ అగ్ర నేతలందరూ లొంగిపోయారు.. కేవలం మీరు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుత కాలంలో సమాజానికి మావోయిస్టులు అవసరం లేదు కాబ ట్టి పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గణపతి లొంగిపోతే ఆయనను కుటుంబానికి అప్పగించాలి’ అని రాంచందర్ రావు కోరారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు లొంగుబాటు
ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టు నాయకుడు మల్లేశ్ లొంగిపోయాడు. కాంకేర్ జిల్లా చోటీ బేటియా డీవీసీఎం (డివిజన్ కమిటీ) సభ్యుడిగా పనిచేస్తున్న మల్లేశ్.. తాను లొంగిపోతానని పత్రికా ప్రటనలు విడుదల చేశాడు. ఇదే క్రమంలో బుధవారం గ్రామస్థులతో కలిసి వచ్చిన మల్లేశ్ సీఆర్పీఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయాడు. అలాగే తాను వినియోగిస్తున్న ఏకే47 తుపాకీ, వాకీటాకీలను అప్పగించాడు. కాగా మల్లేశ్ లొంగిపోయే ముందు అతడిని చూసి చాలా మంది చలించిపోయారు. చిరిగిన దుస్తులు, అలసిపోయిన ముఖంతో ఉన్నాడని స్థానికులు తెలిపారు.