నువ్వెందుకు లొంగిపోలేదు అక్కా..!
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:58 AM
అందరూ లొంగిపోయారు. నువ్వెందుకు లొంగిపోలేదే అక్కా.. నమ్మిన సిద్ధాంతం కోసం చివరిశ్వాస వరకు పోరాడావు.’’ అంటూ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్...
భాగ్య మృతదేహం చూసి సోదరి కవిత కన్నీటి పర్యంతం
దుబ్బాక/మిరుదొడ్డి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘అందరూ లొంగిపోయారు. నువ్వెందుకు లొంగిపోలేదే అక్కా.. నమ్మిన సిద్ధాంతం కోసం చివరిశ్వాస వరకు పోరాడావు.’’ అంటూ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు నేత భాగ్య అలియాస్ రూపీ మృతదేహాన్ని చూసి సోదరి కవిత రోదించిన తీరు కాంకేర్ ఆస్పత్రి వద్ద ఉన్న వారందరినీ కదిలించింది. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా ఆసుపత్రిలో ఉన్న సోదరి మృతదేహాన్ని మంగళవారం చూసి అక్కడే కుప్పకూలి పోయింది. తన అక్కను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేసింది. భాగ్య మెడపై తాడుతో బిగించినట్లు గుర్తులు ఉన్నాయని, శరీరంపై వేడి ఇనుప చువ్వలతో గుచ్చినట్లు గాయాలు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొంది. పోస్ట్మార్టం అనంతరం భాగ్య మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. భాగ్య భర్త విజయ్రెడ్డి స్వగ్రామమైన కర్నూల్ జిల్లా వడ్లరామారంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే, తన బిడ్డ ఆఖరి జాడలు తమ గ్రామంలోనే ఉండాలని తల్లి కోరుకోవడంతో ధర్మారంలోనే బుధవారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు.