కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇంటిపై దాడి కేసులో మన్నె క్రిశాంక్ అరెస్టు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:18 AM
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండుమల్ల రాజేందర్ ఇంటిపై దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ..
మూసాపేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండుమల్ల రాజేందర్ ఇంటిపై దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. క్రిశాంక్తోపాటు పలువురు తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడినట్లు కూకట్పల్లి పోలీసులకు రాజేందర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే క్రిశాంక్ను ఉద్దేశిస్తూ రాజేందర్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎందుకు పోస్టు పెట్టారంటూ క్రిశాంక్ తన అనుచరులతో కలిసి కూకట్పల్లిలోని రాజేందర్ ఇంటికి వెళ్లగా.. వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రాజేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం క్రిశాంక్, అతని అనుచరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా మంత్రులు చేస్తున్న అవినీతిపై ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు.