బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి : మల్లు రవి
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:10 AM
బీఆర్ఎస్ పన్నిన వలలో మాజీ మంత్రి జీవన్రెడ్డి చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్ ఎందుకు రావాలో జీవన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ విషకౌగిలిలో బలి ఖాయం: ఆది శ్రీనివాస్
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పన్నిన వలలో మాజీ మంత్రి జీవన్రెడ్డి చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్ ఎందుకు రావాలో జీవన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో చాలా ఏళ్లు పనిచేసిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ కూడా బీఆర్ఎ్సలో చేరారని, ఆ తర్వాత గుర్తింపు లేకుండా రాజకీయ జీవితాన్ని ఎలా గడిపారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన నాగం జనార్దన్రెడ్డి.. ఇంకా చాలామంది నేతలు బీఆర్ఎ్సలో చేరారని, కేవ లం చేరిన ఒక్కరోజే పండగ రోజు.. ఆ తర్వాత అన్ని దండగ రోజులేనని, ఈ విషయాన్ని జీవన్రెడ్డి గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. మరోవైపు, శనివారం రైల్వే బోర్డు చైర్మన్తో మల్లు రవి భేటీ అయ్యారు. డోర్నకల్-గద్వాల నూతన రైల్వే లైన్కు సంబంధించిన అలైన్మెంట్, డీపీఆర్ గురించి చర్చించారు. కాగా, నాలుగు దశాబ్దాలపాటు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని వీడి, కేసీఆర్ వంటి నియంతలతో చేతులు కలపడం జీవన్రెడ్డి రాజకీయ పతనానికి నిదర్శనమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జీవన్రెడ్డి ఆత్మను చంపుకుని, ఆత్మాభిమానాన్ని వదులుకుని కేసీఆర్ కౌగిలిలోకి వెశ్లారని, అందులో చిక్కుకుని కనుమరుగైన సీనియర్ నేతల గతిని ఆయన గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జీవన్రెడ్డి దొంగలకు సద్దులు మోస్తున్నారని టీపీసీసీ ప్రదాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు.