పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవు
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:06 AM
సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ హెచ్చరించారు.
మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చాం..
22-ఏపై బీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతం: మహేశ్ గౌడ్
నిజామాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వాఖ్యలు బాధాకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని.. ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడారో వివరణ కోరామన్నారు. అభ్యర్థులం తామేనని ఎవరు ప్రకటించుకున్నా చెల్లదని, అభ్యర్థుల ఎంపికకు పార్టీలో ఓ విధానం ఉంటుందని.. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. 22-ఏ విషయంలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.