Share News

పాఠశాలల్లో న్యాయ విద్య

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:58 AM

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల్లో న్యాయ అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వారి హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

పాఠశాలల్లో న్యాయ విద్య

  • విద్యాశాఖతో న్యాయ సేవాసంస్థ ఒప్పందం

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల్లో న్యాయ అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వారి హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయసేవా సంస్థ, పాఠశాల విద్యాశాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. న్యాయసేవా సంస్థ కార్యాలయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సమ్‌కోషి సమక్షంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్‌.పంచాక్షరి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌, అదనపు కార్యదర్శి లింగయ్య పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జడ్పీ, గురుకుల పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో న్యాయ విద్యపై విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాలకార్మిక చట్టాలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తారు. అలాగే ప్రతి పాఠశాలలో బాలల సంరక్షణ అధికారిగా ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తారు. అన్ని బడుల్లో లీగల్‌ లిటరసీ క్లబ్‌లు, చైల్డ్‌ రైట్స్‌ క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని బడుల్లో దీన్ని అమలుచేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.అన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 07:00 AM