షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:56 AM
‘నీవు షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో.. మాకు అభ్యంతరం లేదు.. కానీ పేదలకు టోపీ పెడితే నిజాం నవాబునే తరిమి కొట్టిన తెలంగాణ ప్రజలు సహించరు.
పేదలకు టోపీ పెడితే సహించే ప్రసక్తే లేదు
సీఎం రేవంత్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విసుర్లు
యాదాద్రి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘నీవు షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో.. మాకు అభ్యంతరం లేదు.. కానీ పేదలకు టోపీ పెడితే నిజాం నవాబునే తరిమి కొట్టిన తెలంగాణ ప్రజలు సహించరు. కాంగ్రెస్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక చర్యలను తిప్పి కొడతారు’ అని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపాలిటీలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లింలదని చెబుతున్న రేవంత్.. పేదలంటేనే ముస్లింలుగా వ్యవహరిస్తూ.. ఒక వర్గానికే దేశ సంపదను పంచుతానంటున్నారని ఆరోపించారు. పేదరికానికి కులం, మతం ఉండదని ఆయన చెప్పారు. కాళేశ్వరంలో అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్.. విచారణ కోసం సీబీఐకి ఆధారాలు అందించాల్సిన బాధ్యత కూడా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు చేసిన సీఎం రేవంత్.. ప్రజల దృష్టి మళ్లించడానికే రాజ్యాంగ విరుద్ధమైన, మత పరమైన రిజర్వేషన్ల అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్త్తున్నారన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయడానికి చట్టం తెస్తానంటున్న సీఎంకు.. ముందు హిందువులపై విద్వేషపూరితంగా మాట్లాడుతున్న ఒవైసీ సోదరులను అరెస్టు చేసే దమ్ము ఉందా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.