Share News

kumaram bheem asifabad- కొరవడిన ‘చెత్త’ శుద్ధి

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:06 PM

పల్లెల్లో ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి రీసైక్తింగ్‌ చేసి, వాటిని విక్రయించడం ద్వారా ఆదాయం వచ్చేలా చేయాలనే లక్ష్యంపై చిత్తశుద్ధి కరువైంది. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది.

kumaram bheem asifabad- కొరవడిన ‘చెత్త’ శుద్ధి
బెజ్జూరు మండలంలో అలంకారప్రాయంగా మారిన సెగ్రిగేషన్‌ షెడ్డు

- నిర్మాణాలకే పరిమితం.. వినియోగంలోకి రాని వైనం

- పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి రీసైక్తింగ్‌ చేసి, వాటిని విక్రయించడం ద్వారా ఆదాయం వచ్చేలా చేయాలనే లక్ష్యంపై చిత్తశుద్ధి కరువైంది. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది. పారిశుధ్య నిర్వహణతో పాటు సేంద్రియ ఎరువును సమకూర్చాలని ఒక్కో పంచాయతీకి సెగ్రిగేషన్‌ షెడ్డును అందుబాటులోకి తీసురావాలని సంకల్పించింది. ఈ మేరకు ఒక్కో షెడ్డుకు రూ.2.40లక్షలు మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్‌ వంటి తదితర పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసి గడులలో భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు. వీటి ద్వారా గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించాలి. కాగా ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయినా సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకారప్రాయంగా మారాయి. మరి కొన్ని చోట్ల షెడ్లలోని గడుల్లో తడి, పొడి చెత్తను వేసి అలాగే వదిలేశారు. దీంతో సెగ్రిగేషన్‌ షెడ్ల పరిసర ప్రాంతా ల్లో కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించడానికి, సేంద్రియ ఎరువు తయారు చేయడానికి నిర్మించిన షెడ్లు ఎక్కడా కూడా ఉపయోగంలోకి తేకుండా వదిలేశారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్ల్లాలో 335పంచాయతీలకు షెడ్లు మంజూరు కాగా, 335షెడ్లు ఇప్పటికే పూర్తి చేశారు. గ్రామాల్లో సేంద్రీయ ఎరువుల తయారిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ప్రతి రోజు ఇళ్ల నుంచి సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి వాటిని అమ్మితే గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. అలాగే మిగితా చెత్తను నాడెప్‌ వర్మి కంపోస్టు ట్యాంకులో వేసి ఎరువు తయారు చేసి విక్రయించడంతో లాభా లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సేంద్రియ ఎరువుల తయారీకి అప్పట్లో వానపాములను కూడా సరఫరా చేసినా ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. కాగా గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందికి, కార్యదర్శులకు సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన లేకపోవడంతోనే సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

- శిక్షణ ఇచ్చినప్పటికీ..

మొదట్లో వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ వర్మి కంపోస్టు తయారీ పద్ధతి తెలియకపోవడం, పంచాయతీల్లో సరిపడా సిబ్బంది, గ్రామాల్లో డంప్‌ యార్డులు లేకపోవడంతోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సంబంధిత అధికారులు పట్టించుకోని కారణంగా వృథాగా మారాయి. కొన్ని పంచాయతీల్లో మాత్రం షెడ్లను వినియోగించుకుంటూ సేంద్రియ ఎరువును తయారీ చేసి పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్నా పూర్తిస్థాయిలో తయారీ లేక లక్ష్యం నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వీటి నిర్మాణంలో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవడంతో ఎరువుల తయారీకి అవకాశం ఉన్నా అందిపుచ్చు కోలేదు. కాగాఅప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తో ఎరువుల తయారీకి నోచుకోక మూలనపడ్డాయి. ప్రస్తుతం గ్రామపంచాయతీలలో కొత్త పాలక వర్గాల పాలన కొనసాగుతోంది. పంచాయతీల్లో సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారించాలని డిమాండ్‌ ఉంది. ఇక కొత్త పాలకవర్గాలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సేంద్రియ ఎరువులు తయారీ చేసి రైతు లకు ఉపయోగపడేలా చూడాలని పలువురు కోరు తున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వీటిని వినియోగంలోకీ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 03 , 2026 | 11:06 PM