కాంగ్రెస్కు ఓటేస్తే మోసానికి వేసినట్లే..
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:13 AM
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మోసానికి వేసినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్న బీఆర్ఎస్ ఒకవైపు, అడ్డమైన హామీలు..
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
సిరిసిల్ల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మోసానికి వేసినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్న బీఆర్ఎస్ ఒకవైపు, అడ్డమైన హామీలు.. ఆరు గ్యారెంటీలనే మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మరోవైపు, 12 ఏళ్లుగా ఏమీ చేయకుండా దేవుడి పేరుచెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ ఇంకోవైపు ఉన్నాయన్నారు. గురువారం సిరిసిల్లలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతుబంధు సొమ్ము వేయడానికి సీఎంకు మునిసిపల్ ఎన్నికలు ఎలా అడ్డొస్తున్నాయని ప్రశ్నించారు. సీఎంకు చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్ను తిట్టాల్సిన అవసరం ఏముందని, చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయాల న్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తనపై కోపంతో సిరిసిల్ల జిల్లాను లేకుండా చేయాలని చూస్తున్న ఆ కుట్రలకు బుద్ధి చెప్పాలన్నారు. మునిసిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ను మళ్లీ సీఎంను చేసుకునేందుకు శ్రీకారం చుట్టాలన్నారు. బీజేపీ వాళ్లు దేవుడి పేరు చెప్పి గుడి ముందు అడుక్కునే వాళ్లలా ఓట్లకోసం వస్తారన్నారు.