ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్కు కేటీఆర్ పరామర్శ
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:15 AM
క్యాతన్పల్లి ఘటనలో ఆదిలాబాద్ జైలుకు తరలించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పరామర్శించారు.
బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ వాయిదా
ఆదిలాబాద్, మంచిర్యాల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : క్యాతన్పల్లి ఘటనలో ఆదిలాబాద్ జైలుకు తరలించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం జైలు బయట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎన్నో అరాచకాలు చేశాయని, ప్రజలు బుద్ధి చెప్పినా ప్రజాతీర్పును అపహాస్యం చేసే విధంగా కాంగ్రెస్ దుర్మార్గాలను చేస్తోందన్నారు. క్యాతన్పల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్ అరాచకాలను, అధికారుల అక్రమాలను ప్రశ్నిస్తే బాల్కసుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపడం సిగ్గుచేటన్నారు. ఆయన వెంట మాజీమంత్రులు జోగు రామన్న, గంగుల, ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బోత్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా బాల్క సుమన్ పోలీస్ కస్టడీ పిటిషన్ను కోర్టు 2 రోజుల పాటు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. బాల్క సుమన్ను కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్తోపాటు సుమన్ తరఫు న్యాయవాదుల బెయిల్ పిటిషన్ను పరిశీలించిన మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కవిత తీర్పును ఈ నెల 26కు వాయిదా వేస్తూ మంగళవారం తీర్పును వెలువరించారు.