పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు పట్టుదలతో రాణించాలి: కేటీఆర్
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:22 AM
ప్రపంచవ్యాప్తంగా పురుషాధ్యిక్యత అధికంగా ఉన్నప్పటికీ, మహిళలు పట్టుదలతో ముందడుగు వేసి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
చందానగర్, మార్చి7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా పురుషాధ్యిక్యత అధికంగా ఉన్నప్పటికీ, మహిళలు పట్టుదలతో ముందడుగు వేసి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. చందానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 40 మంది మహిళలను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. పురుషాధిక్యత ఉన్న రాజకీయాల్లో లేదా ఇతర రంగాల్లో మహిళలు విజయం సాధించాలంటే పురుషుల కంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామనిచెప్పారు.