బిహార్ను తలదన్నేలా రాష్ట్రంలో నేరాలు
ABN , Publish Date - May 05 , 2026 | 04:05 AM
బిహార్, యూపీని తలదన్నుతూ నేరాల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కరీంనగర్ ఘటనలో దొంగలను పట్టుకోలేని హీన స్థితిలో పోలీసు యంత్రాంగం ఉంది: కేటీఆర్
కరీంనగర్/కంది/సదాశివపేట, మే 4 (ఆంధ్రజ్యోతి): బిహార్, యూపీని తలదన్నుతూ నేరాల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కరీంనగర్లో జ్యువెల్లరీ షాపు దోపిడీ జరిగి ఒకరోజు గడిచినా.. దొంగలను పట్టుకోలేని హీనస్థితిలో పోలీసు యంత్రాం గం ఉందని విమర్శించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన హోం శాఖ మంత్రి పదవిలో ఉన్న సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నగల దుకాణంలో దోపిడీ ఘటనలో గాయపడిన వారిని కరీంనగర్లో సోమవారం కేటీఆర్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో కరీంనగర్ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. పోలీసులు సీఎంకు ప్రైవేట్ ఆర్మీలా పని చేస్తున్నారని, బెంగళూరు నుంచి పైవ్రేట్ హ్యాకర్లను తీసుకువచ్చి బీఆర్ఎస్ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన క్రిశాంక్పై 35పైగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై ప్రశ్నించడమే ఆయన చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు.