రేవంత్కి రావణాసురుడు, నరకాసురుడూ స్ఫూర్తే!
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:09 AM
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది.
అందుకే ఆయన పాలనలో రాష్ట్రం ఆగమైంది: కేటీఆర్
ఖమ్మం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. రాష్ట్రంలో సంక్షేమం ఆగమైంది. అబివృద్ధి ఆగిపోయింది. సీఎం రేవంత్రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అన్నాడు. ఆయనకు రావణాసరుడు, నరకాసురుడు కూడా స్ఫూర్తే. అందుకే రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోంది’ అని కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం సర్ ప్రక్రియపై నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే రెవెన్యూ శాఖ మంత్రి ఆదాయం మాత్రం భారీగా పెరుగుతోందని; వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలనలో రాష్ట్రమంతా వ్యవసాయ సంక్షోభం ఉందని; రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం కమీషన్ల దందా జోరుగా సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఓటరు జాబితా సర్ జరుగుతోందని, బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఓట్లు తగ్గితే.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు.