రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా?
ABN , Publish Date - May 22 , 2026 | 03:54 AM
పంట అమ్ముకునేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండె పగిలి కుప్పకూలుతున్నారని, రైతుల ప్రాణాలు పోతున్నా పంటను కొనరా...
మొద్దు నిద్ర వీడండి.. సీఎం రేవంత్కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): పంట అమ్ముకునేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండె పగిలి కుప్పకూలుతున్నారని, రైతుల ప్రాణాలు పోతున్నా పంటను కొనరా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సీఎంకు ఆయన లేఖ రాశారు. కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకు తోడు సర్కారు చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోయినా... పరిస్థితిని సీఎం ఒక్కసారి కూడా పరిశీలించలేదన్నారు. సీఎం తన కుర్చీని కాపాడుకొనేందుకు ఢిల్లీకి మూటలు మోయడం తప్ప... ధాన్యాన్ని కొనాలన్న సోయి కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని, 23న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలోనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.