కాంగ్రెస్ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధం
ABN , Publish Date - May 31 , 2026 | 05:50 AM
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు.
కాంట్రాక్టులన్నీ సీఎం బావమరిదికి, మంత్రి పొంగులేటి కొడుకుకే.. టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి : కేటీఆర్
కవాడిగూడ/ముషీరాబాద్, మే 30(ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన కాంట్రాక్టులు, బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబరు 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనతో పాటు ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ 420 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తరువాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి.. ఈ వర్గాలకు కాంట్రాక్టులు రాకుండా జీవో నంబర్ 17 తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే దక్కుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ సమావేశంలో ఎస్ఐఆర్పై కేటీఆర్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నించవచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.