Share News

కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:35 AM

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

  • దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌

  • ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఆదరించండి: కేటీఆర్‌

సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కర్రు కాల్చి వాత పెడితేనే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపైన దృష్టి సారిస్తుందని చెప్పారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లోని వార్డుల్లో ఎన్నికల ప్రచారం, ప్రధాన కూడళ్లలో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు అన్నింటినీ వంద రోజుల్లో అమలు చేస్తానని బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చారని, ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పారిపోయారని విమర్శించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ తెచ్చిన వారెవరో గుర్తుంచుకొని ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.

Updated Date - Feb 07 , 2026 | 04:35 AM