కాంగ్రెస్.. బీజేపీ దోస్తులే: కేటీఆర్
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:09 AM
కాంగ్రెస్, బీజేపీలు దోస్తులేనని.. ఒకటి ప్రజలకు చెయ్యిచ్చే పార్టీ అయితే.. మరొకటి ప్రజల చెవిలో పువ్వు పెట్టే పార్టీ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు.
సిరిసిల్ల, కామారెడ్డి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీజేపీలు దోస్తులేనని.. ఒకటి ప్రజలకు చెయ్యిచ్చే పార్టీ అయితే.. మరొకటి ప్రజల చెవిలో పువ్వు పెట్టే పార్టీ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను నమ్మి మోసపోవద్ద్దని ప్రజలకు సూచించారు. ఒకవైపు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మోదీపై నిప్పులు చెరుగుతుంటే.. మరోవైపు రేవంత్రెడ్డి మాత్రం మోదీని బడే భాయ్ అని సంబోధిస్తున్నారని పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిరిసిల్లలోని 7వ వార్డులో ఏర్పాటైన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘కులం, మతం బువ్వ పెట్టదు. మనిషి సేవాగుణం చూసి ఓటేయాలి. ఏ పార్టీ గెలిస్తే పట్టణం బాగుపడుతుంది.. కడుపు నింపే పనులు చేస్తుందో ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్టీ బలం మరింత పెరుగుతుందని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రేవంత్రెడ్డిని నిలదీయవచ్చని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు తొండి సంజయ్ అని ఎద్దేవా చేశారు.