ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రియల్ దందా
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:58 AM
భారత్ ఫ్యూచర్సిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి రియల్ వ్యాపారానికి తెర లేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రాకెట్ వేగంతో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని రాక్షసుల చేతిలో పెట్టిన ప్రజలు: కేటీఆర్
మహేశ్వరం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్సిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి రియల్ వ్యాపారానికి తెర లేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేండ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా నడిపించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో వికాసం వైపు దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని రాక్షసుల చేతిలో పెట్టిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14 వేల ఎకరాల భూములను రైతులను ఒప్పించి సేకరించామని తెలిపారు. ఇప్పుడు ఆ భూముల్లో ఫ్యూచర్సిటీ నిర్మిస్తామని ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఆటలు ఇకపై సాగనివ్వమన్నారు.