ఆ తీర్పును చదివి విమర్శించండి
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:19 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై తన తీర్పును పూర్తిగా చదివిన తర్వాత విమర్శించాలని అసెంబ్లీలో కేటీఆర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు.
ఫిరాయింపులపై కేటీఆర్కు స్పీకర్ సూచన
నిరంకుశత్వానికి అంబాసిడర్ కేటీఆర్: పొంగులేటి
పోలీసులపైనా బీఆర్ఎస్ నేతల దాడులు: దుద్దిళ్ల
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై తన తీర్పును పూర్తిగా చదివిన తర్వాత విమర్శించాలని అసెంబ్లీలో కేటీఆర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సభలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేటీఆర్ మాట్లాడిన సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. తన తీర్పున పూర్తిగా చదివిన తర్వాత విమర్శించాలే కానీ.. పదే పదే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సభాధ్యక్షుడి తీర్పును ప్రశ్నించడం అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులపైనే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఆది శ్రీనివాస్ వాచీ ఖరీదు రూ.కోటి అంటూ కేటీఆర్ పింక్ మీడియా విష ప్రచారం చేస్తోందని, సదరు ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, రామచంద్రు నాయక్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న కేటీఆర్పై స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.