ఆరు గ్యారెంటీల చట్టబద్ధతకు శాసనసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు: కేటీఆర్
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:37 AM
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై శాసనసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
సిరిసిల్ల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై శాసనసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి చేయలేదని ఆయన గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనంలో సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో ఇటీవల గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులతో ‘రాహుల్ బంధు’ అనే కొత్త పథకం మొదలుపెట్టాడన్నారు. సంవత్సరానికి రూ.1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకాన్ని రేవంత్ పక్కాగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకం ద్వారా రేవంత్ తన సీఎం సీటును కాపాడుకుంటున్నారని, సామంతరాజులా రాహుల్ కుటుంబానికి కప్పం కడుతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్కు చెల్లించాల్సిన కప్పం కోసం హైదరాబాద్ నుంచి ఖమ్మం దాకా పేదల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.