రూ.50 కోట్లు తీసుకుని ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసిన కేటీఆర్
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:13 AM
మాజీ మంత్రి కేటీఆర్ రూ.50 కోట్లు తీసుకుని బోయినపల్లి మార్కెట్ సమీపంలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమికి సీసీఎల్ఏ నుంచి ప్రైవేటు వ్యక్తులకు క్లియరెన్స్ ఇప్పించారని..
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆరోపణ
సికింద్రాబాద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ రూ.50 కోట్లు తీసుకుని బోయినపల్లి మార్కెట్ సమీపంలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమికి సీసీఎల్ఏ నుంచి ప్రైవేటు వ్యక్తులకు క్లియరెన్స్ ఇప్పించారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్.శ్రీగణేష్ ఆరోపించారు.బుధవారం కంటోన్మెంట్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం సదరు ప్రైవేటు వ్యక్తులు కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారని.. డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయన్న కారణంతో ఇటీవల బోర్డు అధికారులు అనుమతిచ్చారని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడి, ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తనపై నిరాధార విమర్శలు చేసే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని శ్రీగణేష్ స్పష్టం చేశారు.