శ్రీశైలంలో కేఆర్ఎంబీ బృందం
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:58 AM
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాంగ్షు బిశ్వాస్ నేతృత్వంలోని బృందం మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించింది.
విద్యుదుత్పత్తి, నీటి వినియోగంపై ఆరా
ప్లంజ్పూల్, క్రస్ట్గేట్లు, గ్యాలరీ పరిశీలన
శ్రీశైలం/బ్రహ్మగిరి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాంగ్షు బిశ్వాస్ నేతృత్వంలోని బృందం మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించింది. ఈ సందర్భంగా కుడి, ఎడమ గట్ల భూగర్భ విద్యుత్ కేంద్రాల్లో పర్యటించి.. రెండు రాష్ట్రాలూ ఏడాది కాలంగా ఉత్పత్తి చేసిన విద్యుత్, జలవినియోగం వివరాలను డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం, గరిష్ఠ స్థాయి నీటి నిల్వ, ప్రస్తుత నీటి నిల్వతోపాటు క్రస్ట్గేట్లు, ప్లంజ్పూల్, లిఫ్టింగ్ రోప్స్, గ్యాలరీ మొదలైనవాటిని పరిశీలించారు. అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తీసుకున్నారు. అదే విధంగా ప్లంజ్పూల్ పనులు చేపట్టేందుకు వేస్తున్న అప్రోచ్ రోడ్డు పనులను కూడా చూశారు. వ్యూపాయింట్లో ఉన్న డ్యాం నమూనాను పరిశీలించి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్, జెన్కో అధికారులతో సమావేశమయ్యారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులను కూడా చైర్మన్ స్వయంగా పరిశీలించారు.