Share News

పదవులు ఉన్నా.. లేకున్నా రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తా

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:22 AM

తనకు పదవులు ఉన్నా.. లేకున్నా రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

పదవులు ఉన్నా.. లేకున్నా రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తా

  • ధర్మకర్తల మండలిపై తప్పని పరిస్థితుల్లోనే మాట్లాడా

  • పార్టీకి దూరంగా ఉండడం అవాస్తవం: రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తనకు పదవులు ఉన్నా.. లేకున్నా రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇటీవల రాహుల్‌గాంధీ తనతో మాట్లాడిన మాటలకు ఎంతో ప్రభావితమయ్యానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం పనితీరుతో పాటు తన సలహాలు కూడా రాహుల్‌ అడిగారని చెప్పారు. తన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవడం ఆయన ఆలోచనా విధానానికి నిదర్శమన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన తనకు ఇచ్చినంత సమయం రాష్ట్రంలోని ఏ నాయకుడికీ రాహుల్‌ ఇవ్వకపోవచ్చునన్నారు. రాహుల్‌గాంధీ సేవలు దేశానికి ఎంతో అవసమమని, రాబోయే ఎన్నికల్లో ఆయనను ప్రధానిని చేసేందుకు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి అంశంపై తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడవలసి వ చ్చిందన్నారు. పార్టీ మీద వ్యతిరేకతతోనో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికో మాట్లాడలేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదని, పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు.

Updated Date - Jul 06 , 2026 | 03:22 AM