‘ఆరు గ్యారెంటీ’లపై రేవంత్ ప్రకటన దశాబ్దపు మోసం
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:12 AM
తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం దశాబ్దపు మోసమని కేంద్ర...
కేరళంలో రేవంత్ అసత్య ప్రచారం: కిషన్ రెడ్డి
హైదరాబాద్, మార్చి3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం దశాబ్దపు మోసమని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు తెలంగాణలో పూర్తిగా విఫలమైందని, ఒక్క పథకం కూడా సమర్థంగా అమలు కాలేదన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ.. అమలు చేయని పథకాలను అమలు చేసినట్టు చెప్పడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. రేవంత్ కేరళంకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసని, తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. రాజకీయ టూరిస్టుల వలలో పడవద్దంటూ కిషన్రెడ్డి, కేరళం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ కేరళం ఎన్నికల ప్రచారంలో అసత్యాలను ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశారని, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని లేఖలో ప్రస్తావించారు.