Share News

కిమ్స్‌ ఆస్పత్రులకు ఏఏసీఐ మల్టీ-సైట్‌ అక్రిడిటేషన్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:40 AM

అమెరికన్‌ అక్రిడిటేషన్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (ఏఏసీఐ) నుంచి మల్టీ-సైట్‌ అక్రిడిటేషన్‌ పొందిన ప్రపంచంలోనే తొలి హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌గా కిమ్స్‌ నిలిచిందని..

కిమ్స్‌ ఆస్పత్రులకు ఏఏసీఐ మల్టీ-సైట్‌ అక్రిడిటేషన్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అమెరికన్‌ అక్రిడిటేషన్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (ఏఏసీఐ) నుంచి మల్టీ-సైట్‌ అక్రిడిటేషన్‌ పొందిన ప్రపంచంలోనే తొలి హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌గా కిమ్స్‌ నిలిచిందని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. సాధారణంగా ఒకే ఆస్పత్రిని మాత్రమే అంచనా వేసే అక్రిడిటేషన్‌ విధానాలకు భిన్నంగా, మొత్తం ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను ఒకే సమగ్ర ఆరోగ్య వ్యవస్థగా ఏఏసీఐ మల్టీ-సైట్‌ అక్రిడిటేషన్‌ పరిశీలిస్తుందన్నారు. నాయకత్వం, పరిపాలన, రోగి భద్రత, క్లినికల్‌ నాణ్యత, సేవలలో ఏకరూపత, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, నిరంతర నాణ్యతాభివృద్ధి వంటి అంశాలను సమగ్రంగా మూల్యాంకనం చేస్తారని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం తమ ఆస్పత్రుల్లో ఒక యూనిట్‌కు ఏఏసీఐ అక్రిడిటేషన్‌ లభించిందని కిమ్స్‌ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు వివరించారు. ఆ గుర్తింపు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పరిపాలనా సిబ్బంది, నాణ్యతా బృందాలు, నాయకత్వం సమష్టి కృషికి నిదర్శనమని, అదే నాణ్యతా వ్యవస్థను ఇప్పుడు మరో ఆరు ఆస్పత్రుల్లో విజయవంతంగా అమలు చేశామని తెలిపారు.

Updated Date - Jun 30 , 2026 | 05:40 AM