6న రైతు సంగ్రామ సభను జయపద్రం చేయండి
ABN , Publish Date - May 04 , 2026 | 04:43 AM
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వె ౖఫల్యాన్ని ఎండగట్టండి
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేటీఆర్, హరీశ్రావుతో భేటీ
గజ్వేల్/మర్కుక్, మే 3 (ఆంధ్రజ్యోతి): వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సంగ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతరత్రా అంశాల పై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం, కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్పై నిలదీయాలని సూచించినట్లు సమాచారం. ‘రైతుల పంటలను కొనుగోలు చేయడంలో సర్కారు విఫలమవ్వడం, యాసంగి రైతు భరోసా ఇప్పటికీ పూర్తిగా అందించకపోవడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, యూరియా యాప్తో రైతులు పడుతున్న ఇబ్బందులు, యాసంగి పంటలు చివరిదశలో ఉన్న నేపథ్యంలో కరెంట్ కోతలపై సర్కారును సభావేదిక సాక్షిగా నిలదీయాలి. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రభుత్వ వైఖరిని రైతు సభలో ఎండగట్టాలి’ అని నిర్ణయించినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈ సభకు కేసీఆర్ వె ళ్లడం లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హాజరవుతారని తెలిసింది.