జగిత్యాలలో నేడు ప్రజా ఆశీర్వాద సభ
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:53 AM
కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సోమవారం బీఆర్ఎస్లో చేరనున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట సోమవారం బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహి స్తోంది.
దాదాపు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న జీవన్రెడ్డి
హైదరాబాద్/ జగిత్యాల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సోమవారం బీఆర్ఎ్సలో చేరనున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట సోమవారం బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహి స్తోంది. ఈ సభలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమక్షంలో జీవన్రెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గత రెండుమూడు రోజులుగా జగిత్యాలలోనే మకాం వేశారు. గతేడాది ఏప్రిల్లో ఎల్కతుర్తి సభలో పాల్గొన్న కేసీఆర్.. సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ ద్వారా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నదానిపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు. కేసీఆర్తో పాటు సుమారు 50 మంది వరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటున్నారనగానే సీఎం రేవంత్రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జగిత్యాల సభను దృష్టిలో ఉంచుకొని ముందే రెండో విడత రైతు భరోసా ప్రకటించారని ఆదివారం ఆయన పేర్కొన్నారు.