Share News

కేబీఆర్‌ పార్కు పరిధిలో చెట్ల నరికివేతపై స్టే పొడిగింపు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:29 AM

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎస్‌జడ్‌ పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో..

కేబీఆర్‌ పార్కు పరిధిలో చెట్ల నరికివేతపై స్టే పొడిగింపు

  • సుప్రీంకోర్టు నిర్ణయం.. తదుపరి విచారణ 24కు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎస్‌జడ్‌ పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పొడిగించింది. కేబీఆర్‌ పార్కు ఈఎస్‌జడ్‌లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ కాజల్‌ మహేశ్వరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా చూడడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా.. ఈఎ్‌సజడ్‌లో ఏయే పనులకు అనుమతి ఉంది? వేటిని నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి, వివరాలు సమర్పించాలని పిటిషనర్లనే ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాజల్‌ మహేశ్వరి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల బఫర్‌ జోన్‌ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకరాదంటూ మే 18న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Updated Date - Aug 21 , 2026 | 06:30 AM