Share News

అవినీతిని వెలికితీయడం ఇష్టం లేదా?

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:12 AM

కొందరు బాడుగ మేధావులు, యూట్యూబ్‌ కుహానా జర్నలిస్టులు అవాకులు, చవాకులు పేలుతున్నారని..

అవినీతిని వెలికితీయడం ఇష్టం లేదా?

  • నేరాన్ని వెలుగులోకి తెస్తే..కులం పేరుతో ఎదురుదాడి చేస్తారా?

  • రాధాకృష్ణపై కొందరి తప్పుడు ఆరోపణలు

  • అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించబోం

  • ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా బుద్ధి చెప్తాం

  • ‘కమ్మ మహాజన సంఘం-ఖమ్మం’ హెచ్చరిక

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): కొందరు బాడుగ మేధావులు, యూట్యూబ్‌ కుహానా జర్నలిస్టులు అవాకులు, చవాకులు పేలుతున్నారని.. వారిని ఉపేక్షించబోమని ‘కమ్మ మహాజన సంఘం-ఖమ్మం’ హెచ్చరించింది. తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు ఆపకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా బుద్ధిచెబుతామని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘నైనీ బొగ్గు బ్లాకు టెండరులో సైట్‌ విజిట్‌ నిబంధన పెట్టి.. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ వెలుగులోకి తెచ్చారు. మైనింగ్‌ రంగంలో ఎంతో అనుభవమున్న కంపెనీలు నైనీ కోల్‌బ్లాక్‌ సైట్‌ విజిట్‌ చేసి, సర్టిఫికెట్‌ కోసం ఇబ్బందులు పడ్డాయి. ఆ కంపెనీలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించారు. దానిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం పెట్టి.. నైనీ టెండర్లు రద్దు చేస్తున్నామని, నిబంధనలు పరిశీలించి మళ్లీ టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. కానీ కొందరు ఈ అంశంలో అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. అక్షరమే ఆయుఽధంగా రాధాకృష్ణ నైనీ కోల్‌బ్లాక్‌ టెండర్ల లోపాలను వెలుగులోకి తెస్తే.. ఉప ముఖ్యమంత్రి భట్టి ఆ టెండర్‌ను రద్దుచేశారు. దానిని అభినందించాలి. కానీ రాధాకృష్ణపై కుహానా విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో తెలంగాణ ఉద్యమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రాణహిత కాలమ్‌ రాసిన అల్లం నారాయణను అడగండి. బతుకమ్మ సంబురాలకు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు రాధాకృష్ణ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆర్‌ఎ్‌సఎస్‌ నుంచి ఆర్‌ఎ్‌సయూ వరకు మేధావులకు తెలుసు. అలాంటిది బొగ్గు బ్లాక్‌ టెండర్లలో అవినీతిని వెలుగులోకి తెచ్చిన రాధాకృష్ణపై విమర్శలు చేయడం.. అవినీతికి పాల్పడి మాది ఫలానా కులం, మాపై అగ్రవర్ణాలు దాడి చేస్తున్నాయనడం రాజ్యాంగ సమ్మతమేనా?’’ అని ప్రశ్నించింది. యూట్యూబ్‌ చానల్స్‌లో, ప్రెస్‌మీట్లు పెట్టి రాధాకృష్ణపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న కొందరి వ్యవహారంపై భట్టి విక్రమార్క విజ్ఞతతో స్పందించాలని కోరింది.

Updated Date - Jan 24 , 2026 | 05:12 AM