ఏ కుటుంబంలో పుట్టినా.. మహిళలపై వివక్షే
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:48 AM
ఏ కుటుంబంలో పుట్టినా.. మహిళలపై చాలా సందర్భాల్లో వివక్ష కొనసాగుతూనే ఉందని.. తండ్రి, అన్న, భర్త వంటి వారు కూడా వారిని తక్కువ చేసి చూస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఏ కుటుంబంలో పుట్టినా.. మహిళలపై చాలా సందర్భాల్లో వివక్ష కొనసాగుతూనే ఉందని.. తండ్రి, అన్న, భర్త వంటి వారు కూడా వారిని తక్కువ చేసి చూస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మహిళలతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ‘గివ్ హర్ ేస్పస్’ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. సమాజంలోని పురుషాధిక్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ అనే కార్యక్రమాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. మహిళల పక్కన పురుషులు ఉంటేనే ఆడవాళ్లకు భద్రత ఉంటుందన్నట్లుగా కార్యక్రమం ఉందని, ఇది ఆడబిడ్డలను అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. మహిళలను, చిన్న పిల్లలను రక్షించడం ఈ ప్రభుత్వానికి చేతకాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమమైందని ఆరోపించారు. మహిళలకు కేరళ తరహాలో ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. సీఎం 99రోజుల ప్రణాళిక అంటున్నారని, కాంగ్రెస్ మొదట మోసం చేసింది మహిళలనేనని విమర్శించారు. ఎన్నికలప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రభుత్వపు 99మోసాలను ఎండగడుతూ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.