రక్తం ప్యాకెట్లతో రాజకీయం అవసరం లేదు
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:24 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, ప్రాజెక్టు కూలడానికి కారణం బీఆర్ఎసేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కాళేశ్వరం కూలడానికి కారణం బీఆర్ఎసే
ఊరురా తిరిగి వాళ్ల కుట్రలు వివరిస్తాం: మంత్రి పొన్నం
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, ప్రాజెక్టు కూలడానికి కారణం బీఆర్ఎసేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కుంగిపోయిన బ్యారేజీలో నీళ్లు నింపితే, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వారిలా రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఊరురా తిరిగి బీఆర్ఎస్ కుట్రలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఇంజనీర్లం కాదని, ఇంజనీర్లు ఇచ్చే సలహాలను పాటిస్తామని పొన్నం స్పష్టం చేశారు. ఎన్డీఎ్సఏ నివేదికలో నీళ్లు నింపాలని సూచిస్తే.. తాము వెంటనే నింపుతామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు కావాలనే మేడిగడ్డ, కన్నెపల్లిపై రాజకీయం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎల్నినోను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తరపున ప్రజలకు సూచనలు చేస్తున్నామని, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని కోరారు.