కేయూలో చికెన్ కోసం కొట్లాట!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:36 AM
కాకతీయ యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్లో వడ్డించగా మిగిలిన చికెన్ను పంచుకునే విషయమై విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం..
మిగిలిన చికెన్ పంపకాలపై వివాదం..
కర్రలు, ఇనుప వస్తువులతో ఎకనామిక్స్- ఎంబీఏ విద్యార్థుల మధ్య దాడులు
పలువురికి గాయాలు.. పోలీస్ పికెటింగ్
కేయూ క్యాంపస్ ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కాకతీయ యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్లో వడ్డించగా మిగిలిన చికెన్ను పంచుకునే విషయమై విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం.. చినికిచినికి గాలివానలా మారింది. పరస్పర దాడులతో పలువురికి గాయాలవ్వగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి గొడవలు జరగ్గా.. సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి విద్యార్థులకు వడ్డించిన తర్వాత చికెన్ మిగలగా ఎకనామిక్స్ విభాగానికి చెందిన రజనీకాంత్ తీసుకెళ్లబోయాడు. అయితే అది గమనించిన ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులు అడ్డుకోబోగా.. రజనీకాంత్ ఒకరిపై దాడి చేశాడు. దీంతో ఎంబీఏ విద్యార్థులు తిరిగి రజనీకాంత్తో పాటు అతడి రూంమెట్స్పై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఎంబీఏ-ఎకనామిక్స్ విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి కర్రలు, ఇనుప వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు క్యాంప్సకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. రజనీకాంత్ను అదుపులోకి తీసుకుని వర్సిటీ పోలీ్సస్టేషన్కు తరలించారు. అదే రాత్రి అతడిని విడిచిపెట్టగా క్యాంప్సకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్కు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు వచ్చి ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులపై దాడికి దిగారు. ఇటు ఎంబీఏ జూనియర్ విద్యార్ధులకు మద్దతుగా సీనియర్ విద్యార్థులు వచ్చారు. దాడుల్లో హాస్టల్లోని పలు గదుల అద్దాలు ఽధ్వంసమయ్యాయి. ఎంబీఏ విద్యార్థులు భావ్సింగ్, మణికుమార్, సచిన్, అఖిల్, శ్రీనాఽథ్, యశ్వంత్లు గాయపడ్డారు. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరస్పర దాడులతో క్యాంప్సలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. సోమవారం కేయూ ఎస్సై కల్యాణ్కుమార్ నేతృత్వంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
గొడవలకు కారకులపై చర్యలు..
విద్యార్థుల గొడవల నేపథ్యంలో కేయూ ఉన్నతాధికారులు సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమయ్యారు. గొడవలకు కారణాలను విభాగాధిపతులు, హాస్టల్ డైరెక్టర్లు.. వర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రామచంద్రం, వీసీ ప్రతా్పరెడ్డిలకు నివేదించారు. ప్రశాంతంగా ఉండే క్యాంప్సను కలుషితం చేసే చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. గొడవలకు కారణమైన విద్యార్థులపై వర్సిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. తదుపరి వర్సిటీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది.