ప్రపంచానికి మన బహుమతుల్లో బౌద్ధం ఒకటి
ABN , Publish Date - May 02 , 2026 | 05:03 AM
ప్రపంచానికి భారతదేశం అందించిన అనేక బహుమతుల్లో బౌద్ధం ఒకటని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మతాలకతీతంగా మానవులు శాంతియుత మార్గంలో నడవాలని..
బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయిలో వసతులు
బుద్ధ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి వ్యాఖ్యలు
నాగార్జునసాగర్, మే1(ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి భారతదేశం అందించిన అనేక బహుమతుల్లో బౌద్ధం ఒకటని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మతాలకతీతంగా మానవులు శాంతియుత మార్గంలో నడవాలని ఆయన సూచించారు. మానవుని దుఃఖానికి కారణం కోరికలేనని బుద్ధుడు అనాడే చెప్పారని, నేను, నాది అనేది వదిలితే మనిషి సంతోషంగా జీవిస్తాడని మంత్రి చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని బుద్ధవనంలో నిర్వహించిన 2570వ బుద్ధ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. రూ.10.50లక్షల వ్యయంతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించి బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బౌద్ధం ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని, ఇటీవలే హైదరాబాద్లో ప్రపంచ శాంతి సదస్సు నిర్వహించడం అందుకు ఉదాహరణగా ఆయన తెలిపారు. బుద్ధవనంలో ప్రభుత్వం తరపున 36 అడుగుల బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే సాగర్లో మినీ శిల్పారామం ఏర్పాటు చేస్తామన్నారు.