పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్న్షిప్
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:50 AM
ప్రభుత్వ పాలిటెక్నిక్లలో డిప్లొమా చేస్తున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించేందుకు జేఎన్టీయూ సిద్ధమైంది. ఇందుకుగాను అనుబంధ కాలేజీలతోపాటు...
‘జేఎన్టీయూ’తో 24 పాలిటెక్నిక్ల అనుసంధానం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలిటెక్నిక్లలో డిప్లొమా చేస్తున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించేందుకు జేఎన్టీయూ సిద్ధమైంది. ఇందుకుగాను అనుబంధ కాలేజీలతోపాటు, వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు అటానమస్ కళాశాలలతో 24 ప్రభుత్వ పాలిటెక్నిక్లను అనుసంధానించింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా కళాశాలల్లోని సంబంధిత విభాగాల్లో నైపుణ్య శిక్షణతో, ఉద్యోగ అవకాశాలు, బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్లలో బీటెక్ అర్హత ఉన్న అధ్యాపకులకు పార్ట్టైమ్ ద్వారా ఎంటెక్, పీహెచ్డీ చేసే అవకాశాలను కూడా కల్పించేందుకు జేఎన్టీయూ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎంపిక చేసిన 24 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో 10న సమావేశం నిర్వహించాలని జేఎన్టీయూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కాగా, పాలిటెక్నిక్ కాలేజీలను అనుసంధానించిన ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్టీయూ, ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలున్నాయి.