సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోండి
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:36 AM
సంగారెడ్డిలోని 38 వార్డులు, సదాశివపేటలోని 26 వార్డుల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుంటే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి...
సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి నిధులు తెచ్చి మునిసిపాలిటీలను అభివృద్ధి చేస్తా
రెండు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగురవేయండి
నేను ఎమ్మెల్యేగా లేకున్న మీ పనులు చేయిస్తున్నా
ఇకముందు కూడా చేపిస్తాను
రాహుల్నాయకత్వంలో రేవంత్ పథకాలన్నీ అమలు చేస్తున్నారు
సంగారెడ్డిలో 15వేల మందితో నిర్వహించిన ముఖాముఖి సభలో జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డిలోని 38 వార్డులు, సదాశివపేటలోని 26 వార్డుల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుంటే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి నిధులు తెచ్చి మునిసిపాలిటీలను అభివృద్ధి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం స్థానిక గంజ్ మైదాన్లో ప్రజలతో ముఖాముఖి సభ నిర్వహించారు. సుమారు 15వేల మంది హాజరైన సభలో జగ్గారెడ్డి పలు సామెతల గురించి చెప్పి ప్రజలను ఆలోచింపజేశారు. సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ.8 కోట్ల చొప్పున రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా లేకున్నా పనులు చేయిస్తున్నానని, ఇకముందు కూడా చేపిస్తానని చెప్పారు. రాహుల్గాంధీ నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు, రైతుబంధు, రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి అద్భుతంగా కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.