Share News

బీజేపీ హిస్సా చోరీకి వ్యతిరేకంగా...రాహుల్‌గాంధీ పోరాటం చరిత్రాత్మకం

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:50 AM

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుల్లో ఉన్న లోపాలను సరిచేయాలని శుక్రవారం సాయంత్రం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి...

బీజేపీ హిస్సా చోరీకి వ్యతిరేకంగా...రాహుల్‌గాంధీ పోరాటం చరిత్రాత్మకం

  • ఈ అంశంలో దేశ ప్రజలు ఆయనకు మద్దతివ్వాలి

  • నాలుగోసారి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ కుట్ర

  • పునర్విభజన, మహిళా బిల్లుల్లో అనేక లోపాలున్నాయి

  • వాటిని సరిదిద్దాలనే రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు

  • ఈ బిల్లులతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: జగ్గారెడ్డి

  • బీజేపీ తీరును నిరసిస్తూ సంగారెడ్డిలో భారీ ర్యాలీ

  • జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బిల్లుల ప్రతుల దహనం

సంగారెడ్డిటౌన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుల్లో ఉన్న లోపాలను సరిచేయాలని శుక్రవారం సాయంత్రం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బిల్లుల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. ఇష్టానుసారంగా బిల్లులను ప్రవేశపెడుతూ హిస్సా చోరీకి పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. దేశప్రజలందరూ ఆయనకు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు పడేట్లు ఈవీఎంలను డిజైన్‌ చేస్తున్నారని ఆరోపించారు. నాలుగో సారి అధికారంలోకి రావడానికి ఎన్నికల కమిషన్‌ను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. మహిళా బిల్లును యూపీఏ హయాంలోనే సోనియాగాంధీ ప్రవేశపెట్టారని, ఈ బిల్లును మొదట తెచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లుల్లో కుట్ర కోణం ఉందన్నారు. ఈ బిల్లులతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిచేశాకే పార్లమెంటులో బిల్లులు పెట్టాలన్నదే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన డిమాండ్‌ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 04:50 AM