మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి క్లీన్చిట్
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:26 AM
మానవ అక్రమ రవాణా కేసులో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్కుమార్పై దాఖలైన కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురవారం కొట్టివేసింది.
నిర్దోషిగా ప్రకటించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు
కుసుమ్ కుమార్ కూడా నిర్దోషే.. ఆధారాల్లేవని వెల్లడి
బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసు
హైదరాబాద్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా కేసులో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్కుమార్పై దాఖలైన కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురవారం కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి వారిద్దరూ నిర్దోషులని తేల్చింది. జగ్గారెడ్డి, కుసుమ్కుమార్ మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జగ్గారెడ్డిని ఏ1గా, కుసుమ్కుమార్ను ఏ3గా చేర్చింది. అయితే, 2018-23 వరకు జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో ఈ కేసు విచారణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు చేపట్టింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. తూర్పు జగ్గారెడ్డి, కుసుమ్కుమార్ నేరానికి పాల్పడ్డట్లుగా ఆధారాలు లేవని తేల్చింది. వారిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో జగ్గారెడ్డి, కుసుమ్కుమార్ తరపున న్యాయవాది జి.సంతోష్రెడ్డి వాదనలు వినిపించారు.