సామర్థ్య విస్తరణే సవాలు!
ABN , Publish Date - May 31 , 2026 | 05:58 AM
భారత డిఫెన్స్, టెక్నాలజీ రంగాల్లో సాంకేతిక పరంగా లోపం గానీ, సామర్థ్యం పరంగా వెనుకబాటుతనం గానీ లేవని.. సమస్యల్లా సామర్థ్య విస్తరణేనని ఇస్రో మాజీ చైర్మన్ ....
మన సాంకేతిక, సామర్థ్యాల్లో ఎలాంటి లోపాలు లేవు
ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ ఉద్ఘాటన
హైదరాబాద్ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): భారత డిఫెన్స్, టెక్నాలజీ రంగాల్లో సాంకేతిక పరంగా లోపం గానీ, సామర్థ్యం పరంగా వెనుకబాటుతనం గానీ లేవని.. సమస్యల్లా సామర్థ్య విస్తరణేనని ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ అన్నారు. ప్రపంచస్థాయి అంతరిక్ష, రక్షణ సాంకేతికతలు భారత్కు ఉన్నప్పటికీ, అంతరిక్ష ఆధారిత యుద్ధాలు, వ్యూహాత్మక పోటీలు పెరుగుతున్న ఈ యుగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలంటే భారీ స్ధాయి సామర్థ్యాలను విస్తరించుకోవడం, ప్రైవేట్ రంగ విస్తరణ అవసరమని ఇతర వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి రాయదుర్గంలోని టీ-హబ్లో సింపోజియం సంస్థ ఆధ్వర్యంలో ‘ది డే ది స్కై గోస్ డార్క్ : వార్ ఫేర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ శాటిలైట్ డిపెండెన్స్’ సదస్సు జరిగింది. డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి, వైమానిక దళాధిపతి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, అనంత్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ డాక్టర్ సుబ్బారావు పావులూరి, టేక్ మీ 2 స్పేస్ వ్యవస్థాపకులు, సీఈవో రోనక్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ పీజేఎస్ పన్ను(రిటైర్డ్) పాల్గొన్నారు. సింపోజియం వ్యవస్ధాపకుడు గిరీశ్ మల్లసాని మాట్లాడుతూ అంతరిక్ష ఆకాంక్షలు, ఉపగ్రహ మౌలిక సదుపాయాలు, ప్రయోగ సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి భారత్ తన సొంత స్టార్లింక్ను ఎందుకు నిర్మించుకోకూడదని ప్రశ్నించారు. భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం పరంగా చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య ఎల్ -1 మిషన్ విజయాలు అపూర్వమని కిరణ్కుమార్ అన్నారు. మన రక్షణ వ్యవస్ధ బలంగానే ఉందని, ఈ రంగంలో వేగవంతమైన వృద్ధికి ప్రైవేట్ -ప్రభుత్వ భాగస్వామ్యాల అవసరం ఉందని డాక్టర్ జి సతీశ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా గత సింపోజియంలో రూపొందించిన శ్వేతపత్రాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జయేశ్ రంజన్కు గిరీశ్ మల్లసాని, సీఈవో ఆశా వశిష్ట్ అందజేశారు.