Share News

పట్టు ‘తప్పు’తోందా?

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:08 AM

కరీంనగర్‌ నగర పాలక సంస్థలోని టౌన ప్లానింగ్‌ విభాగం పట్టుతప్పుతుందా..? కాసుల ధ్యాసలో పడి అసలు నిబంధనలను విస్మరిస్తున్నారా..? కొందరి చేతి తడపనిదే పని కావడం లేదా..? అంటే.. ఔననే సమాధానాలు నగర ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు

 పట్టు ‘తప్పు’తోందా?

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌/కరీంనగర్‌ టౌన)

కరీంనగర్‌ నగర పాలక సంస్థలోని టౌన ప్లానింగ్‌ విభాగం పట్టుతప్పుతుందా..? కాసుల ధ్యాసలో పడి అసలు నిబంధనలను విస్మరిస్తున్నారా..? కొందరి చేతి తడపనిదే పని కావడం లేదా..? అంటే.. ఔననే సమాధానాలు నగర ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు అభివృద్ధిలో నగరానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంటే.. మరోవైపు కొందరి ధనదాహం వల్ల అవినీతి అపకీర్తిని బల్దియా మూటకట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఇక్కడి సిబ్బంది, అధికారుల పనితీరుపై ఏసీబీ నజర్‌ పెట్టింది. ఏకంగా కార్యాలయంలో అసలేమి జరుగుతుందనే తతంగంపై లోతైన విచారణ జరుపుతోంది. రెండు రోజులుగా కార్పొరేషనలో కలకలం సృష్టిస్తున్న ఈ వ్యవహారంపై నగరంలో చర్చ జరుగుతోంది.

ఫ దళారుల పాత్రపైన ఆధారాలు..

నగరంలోని ఇంటి నిర్మాణాలు, కమర్షియల్‌ భవనాల నిర్మాణం అనుమతుల విషయంలో ఇక్కడి కార్యాలయ సిబ్బందికి, నిర్మాణదారుకు మధ్య దళారులు ముఖ్య భూమిక పోషించినట్లు పలు ఆధారాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనుమతులు ఆలస్యం అవడం, డబ్బులు ఇచ్చినా పనులు ప్రారంభం కాని కొన్ని నిర్మాణాల విషయంలో ఏసీబీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీనికితోడుగా తరచూ సిబ్బంది చేతివాటాలు, అవినీతి బాగోతాలపై తరచూ దినపత్రికల్లో వస్తున్న కథనాల ఆధారంగా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలను బల్దియాలో చేపట్టారని తెలిసింది. గంటల తరబడి చేపట్టిన సోదాల్లో సిబ్బంది తప్పిదాలకు ఆస్కారమిచ్చిన కీలక ఫైళ్లు దొరికినట్లు సమాచారం. నిర్ణీత వ్యవధిలో టీజీ-బీపాస్‌ పోర్టల్‌ ఆధారంగా ఆనలైన అనుమతుల్లో కార్యాలయ ఉద్యోగులు, అధికారులు చేసిన జాప్యంతోపాటు స్వీయ ధ్రువీకరణ ఆమోదాల విషయంలోనూ కొన్ని మోసాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంటినిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌, లే అవుట్‌ల క్రమబద్ధీకరణ, నాలా కన్వర్షన సహా మరి కొన్ని దస్ర్తాలను స్వాధీనపర్చుకున్నారు. ఆనలైనలో పౌరసేవలు, లావాదేవీలకు సబంధించిన వాటిని స్ర్కీనషాట్‌ తీసుకోవడంతోపాటు టౌనప్లానింగ్‌ సిబ్బంది మొబైల్స్‌లో ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఇక్కడి టౌన ప్లానింగ్‌లో పట్టుతప్పిన వ్యవహారం, నిర్మాణదారులకు ఎదురైన ఇబ్బందులపై సమగ్రంగా నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు పంపించనున్నారు.

ఫ ముడుపులు ముడితేనే అనుమతులు

ఆనలైనలో సరళీకృత విధానాల అమలు అనే వ్యవస్థ పేరుకు మాత్రమే అనేది కరీంనగర్‌ కార్పొరేషనలో నిరూపితమవుతోంది. ఏ తరహా ఇంటి నిర్మాణమైనా కచ్చితంగా టౌనప్లానింగ్‌ విభాగంలో ఎంతో కొంత ముడుపు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అనుమతులకు సంబంధించిన దస్ర్తాల విషయంలో కొర్రీలు పెట్టడంతోపాటు నిమిషాల వ్యవధిలోనే నిర్మిత ప్రదేశంలో సిబ్బంది వాలిపోతారు. దబాయించడంతోపాటు తట్టా పారలను పట్టుకెళ్తారనే ఆరోపణలున్నాయి. పునాది దశ నుంచే అక్కడి నిర్మాణలపై ప్లానింగ్‌ విభాగం కన్నేస్తుంది. కాసులిచ్చిన వారు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, అసలే అనుమతులు తీసుకోకుండా ఎంతోకొంత ముట్టజెప్పిన వారి అక్రమ కట్టడాల జోలికి వెళ్లరు. నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారిని కన్నెత్తి చూడరు. అదే తమను కలవకుండా ఉన్న వారి విషయంలో కఠినంగా వ్యవహిరిస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన ప్లానింగ్‌ సిబ్బంది చేతివాటాల తీరుపై ఏసీబీ దృష్టి సారించడంతో బల్దియాలోని మిగతా ఇంజినీరింగ్‌, ఇతర సేవల విభాగాల ఉద్యోగుల్లోనూ భయం పుడుతోంది.

Updated Date - Aug 20 , 2026 | 01:08 AM